30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..

31 Jan, 2022 19:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి.

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్‌ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్‌ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్‌ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.  
చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా?

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్‌ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు.
చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి

ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్‌ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్‌ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. 

సహజ ఆహారమే ఎందుకు 
ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది.

ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్‌ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు.  

పాతవైపు..కొత్త చూపు.. 
ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్‌ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.  

ఇంటికి.. ఒంటికి కూడా.. 
సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు,  సబ్బులు, షాంపులు, వంట నూనెలు,  కాస్మోటిక్స్‌ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌మాల్‌ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్‌ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్‌లైన్‌ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి.  

ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు 
ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. 
–గట్రెడ్డి రమాదేవి, గృహిణి

ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం
నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్‌ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.   
–బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ

మరిన్ని వార్తలు