కల్యాణ్‌ జువెల్లర్స్‌ చైర్మన్‌గా మాజీ ‘కాగ్‌’ వినోద్‌ రాయ్‌

29 Mar, 2022 09:57 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) వినోద్‌ రాయ్‌ తమ సంస్థ చైర్మన్, స్వతంత్ర నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా నియమితులైనట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఇండియా వెల్లడించింది. నియంత్రణ సంస్థ, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ నియామకం ఉంటుందని పేర్కొంది. టీఎస్‌ కల్యాణరామన్‌ ఇకపైనా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని వివరించింది. పారదర్శకమైన వ్యాపార విధానాలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కల్యాణ్‌ జువెల్లర్స్‌తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వినోద్‌ రాయ్‌ తెలిపారు. 

వివిధ అంశాల్లో రాయ్‌ అపార అనుభవం తమ సంస్థ పురోగతికి తోడ్పడగలదని కల్యాణరామన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్ల కమిటీకి చైర్మన్‌గా కూడా రాయ్‌ గతంలో వ్యవహరించారు. అలాగే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల్లోనూ వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశీయంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణల కోసం ఏర్పాటైన బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. దేశానికి అందించిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.    

(చదవండి: అంతర్జాతీయ మార్కెట్లలో జోరు.. దేశీ స్టాక్‌ మార్కెట్లలో లాభాల హోరు)

మరిన్ని వార్తలు