న్యూఢిల్లీ: వాహనాలకు థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. 1,000 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్ల ప్రీమియం రూ.2,074 నుంచి రూ.2,094కు పెరగనుంది. 1,000–1,500 సీసీ సామర్థ్యం గల ప్రైవేట్ కార్లకు రూ.3,221 నుంచి రూ.3,416కు, 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉంటే ప్రీమియం రూ.7,890 నుంచి రూ.7,897కు చేరనుంది.
150–350 సీసీ ద్విచక్ర వాహనాలు రూ.1,366, 350 సీసీపైన ఉంటే రూ.2,804 చెల్లించాల్సి ఉంటుంది. గూడ్స్ వాహనాలు 12–20 వేల కిలోల సామర్థ్యముంటే రూ.33,414 నుంచి రూ.35,313కు, 40 వేల కిలోల పైన సామర్థ్యముంటే రూ.41,561 నుంచి రూ.44,242కు చేరనుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు 15 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు 7.5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. థర్డ్ పార్టీ (టీపీ) మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గతంలో నోటిఫై చేసేది. ఐఆర్డీఏఐతో సంప్రదింపుల అనంతరం రోడ్డు రవాణా శాఖ టీపీ రేట్లను ప్రకటించడం ఇదే తొలిసారి.