హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. బుకింగ్‌.. ఫీచర్లు, ధర వివరాలు

7 Oct, 2022 16:10 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు  హీరో మోటోకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.  విడా వీ1, వీ1 ప్రొ  అనే రెండు  వేరియంట్లలో దీన్ని  శుక్రవారం లాంచ్‌ చేసింది.  కొత్త ఈవీ అనుబంధ సంస్థ- విడా బ్రాండ్‌ క్రింద ఇ-స్కూటర్‌లను ప్రారంభించడం ద్వారా దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి  హీరో మోటో ప్రవేశించింది. 

విడా వీ1 ధరను ఇండియాలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. విడా ప్రో రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2499 రూపాయలు  చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి  బెంగళూరు ఢిల్లీ , జైపూర్  మూడు నగరాల్లో దశల వారీగా లాంచ్‌లు ప్రారంభమవుతాయి.

బుకింగ్‌లు అక్టోబర్ 10న ప్రారంభం. డిసెంబర్ రెండో వారంలో డెలివరీలు ప్రారంభమవుతాయని హీరో వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తైవాన్‌కు చెందిన గోగోరో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

ఒక్కో ఛార్జింగ్‌కు 165 కి.మీ వరకు రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని హీరో వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌,  బ్లూటూత్ కనెక్టివిటీ  అండ్‌ టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సాంకేతికతతో వస్తుంది. ఇది OTA అప్‌డేట్‌లను అందించడానికి కనెక్ట్ చేయబడిన సాంకేతికతలను ఉపయోగిస్తుంది.   ఇంకా ఫాలో-మీ-హోమ్ లైట్, SOS హెచ్చరికలు, రివర్స్ మోడ్, బూస్ట్ మోడ్ లాంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. 

కాగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్  బజాజ్ చేతక్ వంటి ప్రీమియం ఇ-స్కూటర్‌లతో పోటీ  ఇవ్వనుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు