5జీ : రేసులో దిగ్గజ ఐటీ కంపెనీలు

18 Mar, 2021 15:23 IST|Sakshi

5జీ టెక్నాలజీకి పెరుగుతున్న  ఆదరణ

రేసులో ముందుకొస్తున్న పలు భారతీయదిగ్గజాలు

ఫిన్‌ల్యాండ్‌ కంపెనీలతో విప్రో, టెక్‌ మహీంద్రా  జట్టు

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి పలు కంపెనీలు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. అందులో భాగంగా భారత్‌కు  చెందిన పలు  దిగ్గజ ఐటీ  కంపెనీలు 5జీ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి రంగంలోకి దిగాయి. భారత్‌లో 5జీ, 6జీ టెక్నాలజీల అభివృద్ధి, విస్తరణ కోసం భారత కంపెనీలు విప్రో ,టెక్ మహీంద్రా ఫిన్‌ల్యాండ్‌ కంపెనీల సహకారంతో కలిసి పనిచేస్తాయని  భారత సీనియర్ అధికారి మంగళవారం తెలియజేశారు.

5జీ సేవలను విస్తరించడానికి ఫిన్‌లాండ్‌ కు చెందిన  నోకియా  కంపెనీ ఇప్పటికే భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోందని సెంట్రల్ యూరప్ ఇన్‌చార్జి జాయింట్ సెక్రటరీ నీతా భూషణ్ మంగళవారం విలేకరులతో అన్నారు. ‘2 జీ, 3జీ, 4జీ  టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో ఫిన్‌ లాండ్‌ ప్రముఖ పాత్ర వహించింది.  విప్రో , టెక్ మహీంద్రా కంపెనీలు  ఫిన్‌లాండ్‌ సంస్థలతో కలిసి 5జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం పనిచేస్తాయని అంతేకాకుండా, భవిష్యత్తులో 6జీ టెక్నాలజీను అందించడంలో పనిచేస్తాయని’ నీతా భూషణ్‌ తెలిపారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిన్‌లాండ్‌ ప్రధానమంత్రి  సనా మారిన్,  ఇరు దేశాల్లో ఆవిష్కరణ, పరిశోధన , సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులతో సహా ఇంధన రంగాలలో కొనసాగుతున్న సహకారంపై సమీక్ష నిర్వహించారు. ఇరు దేశాల ప్రధానులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి క్వాంటం కంప్యూటర్‌ను అభివృద్ధికి ఇరుదేశాలు పాటుపడతాయని మార్చి 16 న జరిగిన వర్చువల్‌ సమావేశంలో తెలిపారు. దేశంలో 5జీ టెక్నాలజీకి ఆదరణ పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు 5జీ బాటపడుతున్న సంగతి తెలిసిందే. ‌(చదవండి: రష్యాను అధిగమించిన భారత్‌..!)

మరిన్ని వార్తలు