వర్క్‌ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం

1 Nov, 2023 16:09 IST|Sakshi

వర్క్‌ ఫ్రం హోమ్‌ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ ఇంట్లోంచే విధులు నిర్వర్తిస్తున్న వారు ఇకపై నెలకు కనీసం పది రోజులపాటు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవెల్‌ నుంచి మధ్య స్థాయి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు తెలిపింది. 

‘‘బ్యాండ్ 5, 6 స్థాయుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల (మిడ్-లెవల్ మేనేజర్‌లు, ప్రాజెక్ట్ హెడ్‌లు, ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు)కు  నెలలో 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాలని మెయిల్‌ పంపారు. కరోనా అనంతరం చాలా కంపెనీలు ఆఫీస్‌ నుంచి పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిమోట్‌ వర్క్‌తోపాటు హైబ్రిడ్‌వర్క్‌ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ఇటీవల కంపెనీ క్యూ2 ఫలితాల సందర్భంగా  వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.  సంస్థలో అందరూ కలిసి ఒకచోట పనిచేయాలని భావిస్తున్నట్లు  సలీల్‌ పరేఖ్‌ చెప్పారు. సాధారణంగా సౌకర్యవంతమైన విధానానికి తాము మద్దతిస్తామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కొన్ని రోజులు కార్యాలయంలో పనిచేయడంతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ పన్ను పెంపు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఇటీవల వర్క్‌ ఫ్రం ఆఫీస్‌కే మొగ్గు చూపింది. దీనివల్ల సంస్థ అసోసియేట్‌లు, కస్టమర్‌ల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందని టీసీఎస్‌ భావిస్తోంది. సంస్థ ఉత్పత్తులను కస్టమర్‌లకు డెలివరీ చేయాలన్నా, వర్క్ అవుట్‌పుట్ మెరుగుపడాలన్నా వర్క్‌ఫ్రం ఆఫీస్‌ ద్వారానే సాధ్యం అని చెప్పింది. ఆఫీస్‌ సంస్కృతి, సహోద్యోగులతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుందని, అందుకు సంబంధించి కంపెనీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని టీసీఎస్‌ సీఈఓ కె కృతివాసన్ వివరించారు.
 

మరిన్ని వార్తలు