హెచ్‌సీఎల్‌కు షాక్‌! కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే..

3 Jun, 2023 20:30 IST|Sakshi

ప్రసిద్ధ ఐటీ సేవల కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌(HCLTech)కి వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగుల యూనియన్‌ కార్మిక శాఖను ఆశ్రయించింది.  2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంగేజ్‌మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లింపు విధానాన్ని అప్‌డేట్ చేసిన హెచ్‌సీఎస్‌ టెక్‌ సంస్థపై ఐటీ ఉద్యోగుల యూనియన్‌  ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.

భారీగా తగ్గిన జీతాలు
త్రైమాసిక పనితీరు రేటింగ్ ప్రాతిపదికన ఈపీబీ చెల్లించే విధానాన్ని హెచ్‌సీఎస్‌ టెక్‌ ఇటీవల సవరించింది. కోవిడ్‌ కంటే ముందున్న ఫార్మాట్‌ను అమలు చేస్తోంది. కోవిడ్‌ సమయంలో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు రేటింగ్‌తో సంబంధం లేకుండా అందరికీ అంటే బెంచ్‌ మీద ఉన్న ఉద్యోగులకు కూడా 100 శాతం ఈపీబీని కంపెనీ చెల్లించేది. కానీ దీన్ని పాత విధానంలోనే ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్‌కు అనుగుణంగా బోనస్‌ చెల్లించునున్నట్లు కంపెనీ ఉద్యోగులకు తెలియజేసింది. ఏప్రిల్‌ 1 నుంచే పాత విధానాన్ని అమల్లోకి తెచ్చిన కంపెనీ ఉద్యోగులకు ఒక రోజు ముందు దీని గురించి ఈ-మెయిల్స్‌ పంపినట్లు తెలిసింది. పాత ఈపీబీ) చెల్లింపు విధానంతో ఉద్యోగుల జీతాలు భారీగా తగ్గాయి.

ఉద్యోగుల ఆక్షేపణలు ఇవి..
నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ ‘గత పాలసీ ప్రకారం, ఉద్యోగులు బెంచ్‌లో ఉన్నప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన స్థిరమైన రేటుతో ఎంగేజ్‌మెంట్ పెర్ఫార్మెన్స్ బోనస్ (ఈపీబీ) చెల్లిస్తామని హెసీఎల్‌  కంపెనీ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈపీబీ చెల్లింపులను నిర్ణయించడానికి త్రైమాసిక పనితీరు సమీక్ష ప్రక్రియను అమలు చేస్తూ కంపెనీ ఆకస్మికంగా పాలసీని మార్చింది’ అన్నారు. 

మార్చిన విధానం ప్రకారం.. ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ రేటింగ్‌ ఆధారంగా ఈపీబీని కంపెనీ చెల్లిస్తుంది. అంటే అత్యుత్తమ పనితీరు రేటింగ్‌ ఉన్న వారికి గరిష్టంగా 80-90 శాతం, తక్కువ రేటింగ్‌ ఉన్నవారికి  కేవలం 30-40 శాతం వరకు ఉంటుందని వివరించారు.

ఇదీ చదవండి  ఈ ఐటీ కంపెనీ సూపర్‌! వెయ్యికిపైగా ఉద్యోగాలు.. 800 మంది భారత్‌ నుంచే..

మరిన్ని వార్తలు