ఎన్‌ఎస్‌ఈ ’యోగి’ వివాదంపై ట్విట్టర్‌ వార్‌..

17 Feb, 2022 01:25 IST|Sakshi

పాయ్, షా మధ్య వాగ్యుద్ధం..

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ చీఫ్‌ చిత్రా రామకృష్ణని  గుర్తుతెలియని హిమాలయా యోగి ప్రభావితం చేసిన అంశం.. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. పరిశ్రమ దిగ్గజాల మధ్య వాగ్యుద్ధానికి మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ వేదికగా మారింది. ఎన్‌ఎస్‌ఈ బోర్డు మాజీ సభ్యుడు టీవీ మోహన్‌దాస్‌ పాయ్, ఫార్మా దిగ్గజం బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌–షా మధ్య ట్వీట్‌ల యుద్ధం నడించింది.

ఎన్‌ఎస్‌ఈలో అవకతవకలకు సంబంధించి, యోగి ప్రభావంతో చిత్రా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ సెబీ ఇచ్చిన ఆదేశాల వార్తాకథనాన్ని ట్విట్టర్‌లో కిరణ్‌ ప్రస్తావించారు. దాని లింక్‌ను షేర్‌ చేసిన మజుందార్‌–షా, నియంత్రణ సంస్థను ప్రస్తావిస్తూ ‘భారత్‌లో టాప్‌ స్టాక్‌ ఎక్సే్చంజీని ఒక యోగి తోలుబొమ్మలాట ఆడించారు. ప్రపంచ స్థాయి స్టాక్‌ ఎక్సే్చంజీగా చెప్పుకునే ఎన్‌ఎస్‌ఈలో గవర్నెన్స్‌ లోపాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు తనిఖీలు, పర్యవేక్షణే లేకుండా పోయిందా‘ అని  ఫిబ్రవరి 13న వ్యాఖ్యానించారు.  

పాయ్‌ కౌంటర్‌..: అయితే, ఎక్సే్చంజీని ఏ యోగీ నడిపించలేదని, దుష్ప్రచారాలు చేయొద్దని 14న పాయ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఎన్‌ఎస్‌ఈని ఏ యోగీ నడిపించలేదు! దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపండి! ఎంతో అధునాతనమైన టెక్నాలజీతో పని చేసే స్టాక్‌ ఎక్సే్చంజీలో ఇలా జరిగిందని మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఎక్సే్చంజీ కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేసే అద్భుతమైన ఉద్యోగులను మీరు అవమానిస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మరుసటి రోజున పాయ్‌ వ్యాఖ్యలపై మజుందార్‌–షా మళ్లీ స్పందించారు.

మరిన్ని వార్తలు