ManpowerGroup Employment Outlook Survey: నియామకాలపై భారత్‌లో బుల్లిష్‌ ధోరణి

14 Dec, 2023 05:44 IST|Sakshi

37 శాతం కంపెనీలు సానుకూలం

రియల్‌ ఎస్టేట్, ఐటీలో ఎక్కువ

మ్యాన్‌వపర్‌ గ్రూప్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: భారత కంపెనీలు వచ్చే మూడు నెలల (2024 జనవరి–మార్చి) కాలానికి నియామకాల పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌వపర్‌ గ్రూప్‌ ఇండియా సర్వే వెల్లడించింది. నియామకాల ఆశావాదం భారత్‌లోనే ఎక్కువగా నమోదైంది. రానున్న మూడు నెలల్లో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటామని 37 శాతం కంపెనీలు చెప్పాయి.

మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఎంప్లాయింట్‌మెంట్‌ అవుట్‌లుక్‌ సర్వే ప్రపంచవ్యాప్తంగా 3,100 కంపెనీలను ప్రశ్నించి ఈ వివరాలను విడుదల చేసింది. 2023 ప్రథమ త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో నియామకాల ధోరణి 5 శాతం ఎక్కువగా కనిపించింది. ‘‘దేశీయ డిమాండ్‌ ఇప్పటికీ స్తబ్దుగానే ఉంది. నిరంతరాయ ప్రైవేటు పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను లాభదాయక ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సాయపడుతున్నాయి’’అని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా ఎండీ సందీప్‌ గులాటి పేర్కొన్నారు.  

భారత్‌లోనే అధికం..  
జనవరి–మార్చి త్రైమాసికానికి నియామకాల పరంగా ఎక్కువ ఆశావాదం భారత్, నెదర్లాండ్స్‌లోనే కనిపించింది. ఈ రెండు దేశాల్లోనూ 37 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలత కనబరిచాయి. ఆ తర్వాత కోస్టారికా, అమెరికాలో ఇది 35 శాతంగా ఉంది. 34 శాతంతో మెక్సికో నియామకాల ఆశావాదంలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా సగటున చూస్తే ఇది రానున్న త్రైమాసికానికి 26 శాతంగా ఉంది.  

ఈ రంగాల్లో సానుకూలం
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నియామకాల సానుకూల త ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత ఐటీ, కన్జ్యూ మర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగాల్లో నియామకాల ధోరణి వ్యక్తమైంది. మార్చి త్రైమాసికంలో నియామకాలు పెంచుకుంటామని ఫైనాన్షియల్స్, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 45 శాతం కంపెనీలు చెప్పాయి. ఐటీ రంగంలో 44 శాతం, కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ రంగంలో 42% కంపెనీలు ఇదే విధమైన దృక్పథంతో ఉన్నాయి. అతి తక్కువగా 28% మేర నియామకాల సానుకూలత ఇంధనం, యుటిలిటీ రంగాల్లో కనిపించింది. మన దేశంలో పశ్చిమ భారత్‌లో ఎక్కువగా 39 శాతం మేర నియామకాల పట్ల కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరాదిలో 38 శాతం సానకూలత కనిపించింది.  

నిపుణుల కొరత
భారత్, జపాన్‌లో నిపుణులైన మానవ వనరుల కొరత అధికంగా ఉంది. భారత్‌లో 81 శాతం సంస్థలు నైపుణ్య మానవ వనరులను గుర్తించడం కష్టంగా ఉందని చెప్పాయి. 2023 సంవత్సరం ఇదే కాలంలోని ఫలితాలతో పోలి్చచూసినప్పుడు ఒక శాతం పెరిగింది. తమకు కావాల్సిన నిపుణులను గుర్తించడం కష్టంగా ఉందని 85 శాతం జపాన్‌ కంపెనీలు చెప్పాయి. ఆ తర్వాత గ్రీస్, ఇజ్రాయెల్‌లోనూ 82 శాతం కంపెనీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించాయి. నిపుణులను గుర్తించి, వారిని నియమించుకుని, అట్టి పెట్టుకునేందుకు కంపెనీలు సౌకర్యవంతమైన పని విధానాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. ఐటీ, డేటా, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్‌ అండ్‌ లాజిస్టిక్స్, హెచ్‌ఆర్‌ నిపుణులకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. 

>
మరిన్ని వార్తలు