సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు

11 Dec, 2023 10:47 IST|Sakshi

సెలవులంటే ప్రతిఒ‍క్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్‌ సెలవుల సీజన్‌ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్‌లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్‌ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్‌ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్‌ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు.

Cisco Survey: సిస్కో యాప్‌ డైనమిక్స్‌ సీజనల్‌ షాపింగ్‌ పల్స్‌ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్‌ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్‌లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్‌లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్‌ హోమ్‌ వంటి ఇంటర్నెట్‌తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్‌ యాప్‌లను ఉపయోగించాలని భావిస్తున్నారు.

84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ కావడానికి సోషల్‌ మీడియా, వీడియో కాల్స్‌ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్‌ యాప్‌లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్‌లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్‌లను, 88 శాతం మంది టేక్‌ అవే కోసం ఫుడ్‌ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది.

>
మరిన్ని వార్తలు