98 పాయింట్లు అప్-38,942 వద్ద సెన్సెక్స్
33 పాయింట్లు పెరిగి 11,505 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్
విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 98 పాయింట్లు పుంజుకుని 38,942 వద్ద కదులుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 11,505 వద్ద ట్రేడవుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.
ఆటో జోరు
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఆటో, బ్యాంకింగ్, మీడియా, రియల్టీ 0.8 శాతం స్థాయిలో బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, ఐషర్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ 3.7-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎయిర్టెల్, ఏషయిన్ పెయింట్స్, ఆర్ఐఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2-0.4 శాతం మధ్య నీరసించాయి.
టీవీఎస్ అప్
ఎఫ్అండ్వో కౌంటర్లలో టీవీఎస్ మోటార్ 6.5 శాతం జంప్చేయగా.. జీఎంఆర్, ఐబీ హౌసింగ్, ఆర్బీఎల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, టాటా కన్జూమర్, డాబర్ 4-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క అదానీ ఎంటర్ప్రైజెస్ 5 శాతం పతనంకాగా.. మ్యాక్స్ ఫైనాన్స్, పెట్రోనెట్, ఎంజీఎల్, భెల్, అరబిందో, గ్లెన్మార్క్, అపోలో హాస్పిటల్స్, ఐడియా, అమరరాజా 1.7-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1194 లాభపడగా.. 521 నష్టాలతో కదులుతున్నాయి.