రికార్డుల మోత, టెక్‌ మహీంద్ర ఘనత

8 Jan, 2021 15:54 IST|Sakshi

సాక్షి, ముంబై:  వరుస రెండురోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం తిరిగి జోష్‌లోకి వచ్చాయి. చివరిదాకా అదే రేంజ్‌ను కొనసాగించాయి. భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మరో ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేశాయి. ఐటీ, ఆటో, ఫార్మా స్టాక్స్‌కు కొనుగోళ్ళ మద్దతుతో కీలక సూచీలు రికార్డుల మోత మోగించాయి. సరికొత్త గరిష్టాల నమోదుతో పాటు వారాంతంలో  రికార్డు స్థాయి వద్ద  ఉత్సాహంగా ముగిశాయి. చివరికి సెన్సెక్స్‌ 689 పాయింట్లు ఎగిసి 48782 వద్ద, నిఫ్టీ 219 పాయింట్ల లాభంతో 14347 వద్ద ముగిసాయి.

ముఖ్యంగా 5 శాతం లాభంతో టెక్ మహీంద్రా 30 షేర్ల ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది  అంతేకాదు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లోకి ప్రవేశించి, ఈ ఘనతను సాధించిన ఐదవ ఐటీ సంస్థగా అవతరించింది. తాజా లాభాలతో టెక్‌ మహీంద్ర మార్కెట్‌ క్యాప్‌ 1.01 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా నిలిచాయి. యూపీఎల్, బీపీసీఎల్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, ఐషర్‌ మోటార్స్‌ నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు నిఫ్టీ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా  జో బైడెన్‌ ఖరారు కావడంతో గ్లోబల్‌ మార్కెట్లు కూడా లాభాలనార్జించాయి. 

మరిన్ని వార్తలు