మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..

30 Aug, 2023 01:13 IST|Sakshi

ధర రూ. 1.72 లక్షలు

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్‌ సీఈవో నిరంజన్‌ గుప్తా తెలిపారు.

తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్‌ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్‌ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్‌లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

మరిన్ని వార్తలు