కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి గుడ్‌న్యూస్‌!

25 Jul, 2021 17:04 IST|Sakshi

విదేశాలకు వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరూ పాస్‌పోర్టు కలిగి ఉండటం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్‌పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్టు సేవలను అందిస్తూ వచ్చింది. అయితే, కొత్తగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త తెలిపింది. ఇండియా పోస్ట్ ఇప్పుడు భారతదేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయాన్ని అందిస్తోంది. ఇక నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ సీ) కౌంటర్లను సందర్శించాల్సి ఉంటుంది అని పేర్కొంది.

పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయం గురించి ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది. "ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ఎస్ కౌంటర్ వద్ద పాస్‌పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సమీప పోస్టాఫీసును సందర్శించండి" అని ట్వీట్ లో పేర్కొంది. పాస్‌పోర్టు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్న, దరఖాస్తు చేసిన పాస్‌పోర్టు దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు ప్రింట్ రసీదు, ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు సేవా కేంద్రం లేదా పాస్‌పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసుకు వెళ్ళవచ్చు.

ఇటీవలే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, ఇతర సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను కూడా ప్రారంభించింది. ఇంకా, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ కోసం డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.

మరిన్ని వార్తలు