దిగొచ్చిన గూగుల్‌.. వర్క్‌ఫ్రమ్‌ హోంపై కీలక ప్రకటన

3 Dec, 2021 16:24 IST|Sakshi

Google Postpone Work From Home End In 2022 January: కరోనా వైరస్‌ వేరియెంట్ల విజృంభణతో పట్టింపు లేకుండా.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలన్న బడా కంపెనీల నిర్ణయానికి బ్రేకులు పడ్డాయి. ఈ విషయంలో ముందుగా నిర్ణయాలు ప్రకటించే ఆల్పాబెట్‌ కంపెనీ ‘గూగుల్‌’.. ఇప్పుడూ ముందడుగు వేసింది. గూగుల్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 


జనవరి, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు తప్పనిసరిగా రావాలన్న ఆదేశాల్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్‌. ఈమేరకు గురువారం ఎంప్లాయిస్‌కు ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ భయాందోళనలు, ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి ఆదేశాలపై నిరసన సెగలు తగిలిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.    

నిజానికి జనవరి నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోం పాలసీకి ముగింపు పలకాలని, వారంలో కనీసం మూడు రోజుల చొప్పున ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని (వ్యాక్సినేషన్‌ పూర్తైన వాళ్లను) గూగుల్‌ ప్రణాళిక వేసుకుంది. ఈ మేరకు ఉద్యోగులతో తేల్చి చెప్పింది కూడా. డెల్టా వేరియెంట్‌ భయాందోళనలు సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లాలని అనుకుంది.

అయితే ఈలోపే త్వరగతిన వ్యాపించే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ఆఫీస్‌ రిటర్న్‌ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ, ముందు అనుకున్న తేదీ (జనవరి 10, 2022) నాటికి నెలకొనే పరిస్థితులను సమీక్షించాకే మరో నిర్ణయం తీసుకుంటామని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్స్‌, ఉద్యోగులతో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే గూగుల్‌కు మొత్తం 60 దేశాల్లో 85 దాకా ఆఫీసులు ఉన్నాయి. జనవరి నుంచి ఉద్యోగుల నుంచి ఎలాగైనా ఉద్యోగులను రప్పించాలని ప్లాన్‌ వేసింది.

 

ఈ క్రమంలోనే అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగులు గత కొన్నివారాలుగా ఆఫీసులకు ‘క్యూ’ కడుతున్నారంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలకే వందల మంది ఉద్యోగులు.. వ్యాక్సినేషన్‌ తప్పనిసరి పాలసీపై నిరసన వ్యక్తం చేయడం, వర్క్‌ఫ్రమ్‌ హోం పాలసీలో మరికొన్నాళ్లు కొనసాగుతామని డిమాండ్‌ చేయడంతో గూగుల్‌ ఇరకాటంలో పడినట్లయ్యింది.

చదవండి: ఒమిక్రాన్‌- హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల పరిస్థితి ఏంటంటే..

మరిన్ని వార్తలు