న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ వన్ మోటో ఇండియా తమ కస్టమర్లకు వాహన బీమా సదుపాయం కల్పించేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో చేతులు కలిపింది.
కస్టమర్లకు సులభతరంగా ఇన్సూరెన్స్ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని వన్ మోటో ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రక్రియలో తాము కూడా పాలుపంచుకోనున్నట్లు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ ఆనంద్ సింఘి తెలిపారు.
బైకా, ఎలెక్టా, కమ్యూటా పేరిట వన్ మోటో ఇండియా మొత్తం మూడు స్కూటర్లను ఆవిష్కరించింది. తొలి దశలో రూ. 250 కోట్లతో 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది.