మళ్లీ పెట్రోల్‌, డీజిల్ ధరల మంట

5 Dec, 2020 11:37 IST|Sakshi

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 27-25 పైసల వడ్డింపు

విదేశీ మార్కెట్లోనూ ముడి చమురు ధరల సెగ

2021 జనవరి తదుపరి సైతం ఉత్పత్తిలో కోతలు

చమురు కోతలకు అంగీకరించిన రష్యా, ఒపెక్‌ దేశాలు

రోజుకి 7.5 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తికి చెక్‌

న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. తాజాగా ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 27 పైసలు బలపడి రూ. 83.13కు చేరింది. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 25 పైసలు అధికమై రూ. 73.32ను తాకింది. ఈ బాటలో కోల్‌కతాలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 76.89కు చేరగా.. పెట్రోల్‌ రేటు రూ. 84.63ను తాకింది. ముంబైలో డీజిల్‌ లీటర్‌ రూ. 79.93గా, పెట్రోల్‌ రూ. 89.78గా నమోదయ్యాయి. ఇక చెన్నైలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 86కు చేరగా.. డీజిల్‌ రూ. 78.69 అయ్యింది. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. కాగా.. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్‌ 20న దేశీయంగా పెట్రోల్‌ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 

కోతల ఎఫెక్ట్‌
తాజా సమావేశంలో భాగంగా రష్యాసహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగాయి. వెరసి శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 1.2 శాతం ఎగసింది. 49.25 డాలర్లను తాకింది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు సైతం 1.4 శాతం జంప్‌చేసి 46.26 డాలర్లకు చేరింది. ఒపెక్‌ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7.2 మిలియన్‌ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. 

దేశీయంగా
విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు