'గూగుల్ పే'ను దాటేసిన ఫోన్‌పే

20 Jan, 2021 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్‌పే, గూగుల్ పేను అధిగమించి డిసెంబర్‌లో టాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపీఐ) యాప్‌గా నిలిచింది. డిసెంబర్ నెలలోనే ఫోన్‌పే ద్వారా రూ.1,82,126.88 కోట్లు విలువ చేసే 902.03 మిలియన్ లావాదేవీలు జరిపినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పిసిఐ) విడుదల చేసిన తాజా గణాంకాల చెబుతున్నాయి. మరోవైపు గూగుల్ పేలో రూ.1.76లక్షల కోట్ల విలువైన 854.49 మిలియన్ లావాదేవీలు జరిగాయి. డిసెంబరులో జరిగిన మొత్తం 2,234.16 మిలియన్ యుపిఐ లావాదేవీలలో ఫోన్‌పే, గూగుల్ పే రెండింటి వాటా 78 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రెండు యాప్‌లు మొత్తం 4,16,176.21 కోట్ల యుపిఐ లావాదేవీల వాల్యూమ్‌లో 86 శాతానికి పైగా ఉన్నాయి.(చదవండి: అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం)

ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం, ఫోన్‌పే డిసెంబరులో లావాదేవీ విలువ గత నెల లావాదేవీల విలువతో పోల్చితే 3.87(868.4 మిలియన్) శాతం పెరుగుదల కనిపించింది. అలాగే, నవంబర్‌లో నమోదైన లావాదేవీల విలువ రూ.1,75,453.85 కోట్లతో పోల్చితే 3.8 శాతం పెరుగుదల కనిపించింది. అదే గూగుల్ పే విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా గూగుల్ పే లావాదేవీల పరిమాణం(960.02 మిలియన్)లో 11 శాతానికి పైగా పడిపోయింది. డిసెంబరులో లావాదేవీ విలువలో 9.15 శాతానికి పైగా పడిపోయింది. వీటి తర్వాత మూడవ స్థానంలో పేటిఎం నిలిచింది. 31,291.83 కోట్ల రూపాయల విలువైన 256.36 మిలియన్ లావాదేవీలతో పేటీఎం మూడో స్థానంలో నిలువగా, కొత్తగా డిజిటల్ పేమెంట్ రంగంలోకి ప్రవేశించిన వాట్సాప్ రూ.29.72 కోట్ల విలువైన 810,000 లావాదేవీలను నిర్వహించింది.

మరిన్ని వార్తలు