ఆటోమొబైల్‌ రంగంపై పన్ను తగ్గించాలి

1 Dec, 2022 14:43 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగంపై పన్నులను వచ్చే పదేళ్ల కాలంలో దశలవారీగా సగానికి తగ్గించాలని ఈ రంగంలో నిపుణులు కోరుతున్నారు.. అప్పుడు భారత ఆటోమొబైల్‌ రంగం అంతర్జాతీయంగా మరింత పోటీ పడగలదని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనతో ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నది వారి అభిప్రాయం.  ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ పన్ను రేటును ఒకేసారి గణనీయంగా తగ్గించడాన్ని సర్దుబాటు చేసుకోలేదన్న వాస్తవాన్ని అంగీకరిస్తూ నిపుణులు ఈ సూచన చేశారు.

దేశ జీడీపీలో ఆటోమొబైల్‌ రంగం వాటాను పరిగణనలోకి తీసుకుని, దశలవారీగా సెస్సును తగ్గించే కార్యాచరణ ప్రణాళిక అవసరమని వారు పేర్కొంటున్నారు. ‘‘ఆటో పరిశ్రమపై పన్నుల భారం అధికంగా ఉంది. కారు తయారీ నుంచి విక్రయించే ధర మధ్య చూస్తే.. చాలా సందర్భాల్లో ఇది ఎక్స్‌షోరూమ్‌ ధరపై 30–50 శాతం మధ్య (జీఎస్‌టీ, ఇతర పన్నులు కూడా కలుపుకుని) అధికంగా ఉంటోంది. తయారీ వ్యయం, నాణ్యత పరంగా భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ పోటీనిచ్చే సత్తా కలిగి ఉంది. అందుకునే నిర్ణీత కాలంలో పన్నులు తగ్గించే ప్రణాళిక అవసరం’’అని ఒక పారిశ్రామిక వేత్త పేర్కొన్నారు.

 కార్ల తయారీలో భాగంగా ఉండే.. స్టీల్, క్యాస్ట్‌ ఐరన్‌ తయారీ నుంచి ముడి సరుకులు, డీలర్‌షిప్‌ల వరకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్‌టీ రేటు అమలవుతోంది. వాహనాన్ని బట్టి 1–22 శాతం మధ్య అదనంగా సెస్సు కూడా పడుతోంది. ఇక పూర్తిగా విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లపై 60–100 శాతం మేర సుంకం అమల్లో ఉంది.

చదవండి: బంపర్‌ ఆఫర్‌..ఆ క్రెడిట్‌ కార్డ్‌ ఉంటే 68 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ!

మరిన్ని వార్తలు