-

రూ.75 నాణెం విడుదల..  కొత్త కాయిన్‌ ఇలా పొందండి..

28 May, 2023 21:28 IST|Sakshi

Rs 75 coin: భారత పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 28) 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కాయిన్‌ను విడుదల గురించి మొదటగా గురువారం (మే 25) విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల స్మారక నాణేన్ని టంకశాలలో తయారు చేస్తున్నట్లు తెలిపింది.

కొత్త కాయిన్‌ ఎక్కడ లభిస్తుంది?
ప్రత్యేక సందర్భాల్లో వివిధ డినామినేషన్లలో విడుదల చేసే కాయిన్లు, స్మారక నాణేలు నేరుగా చలామణిలోకి రావు. ఇవి చలామణి కోసం ఉద్దేశించినవి కావు. ఈ స్మారక నాణేలు కావాలంటే సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.  అక్కడ దానికి సంబంధించి పేర్కొన్న ధరను చెల్లించి ఆ కాయిన్లు పొందవచ్చు. 

అటువంటి నాణేలు కేవలం సేకరించదగినవిగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ వాటి ముఖ విలువకు సమానంగా ఉండకపోవచ్చు. వాటిని వెండి లేదా బంగారం వంటి విలువైన లోహాలతో తయారు చేస్తారు. తాజా విడుదల చేసిన రూ.75  స్మారక నాణెంలో కూడా 50 శాతం వెండి లోహం ఉంది.

2018లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం 100 రూపాయల స్మారక నాణాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్‌సైట్‌లో రూ.5,717కు అందుబాటులో ఉంది.  ఈ నాణెంలో 50 శాతం వెండి, మిగిలినవి ఇతర లోహాలు ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రక సంఘటనలకు గుర్తుకు దేశంలో 1960ల నుంచి స్మారక నాణేలను విడుదల చూస్తున్నారు.

ఇదీ చదవండి: బ్యాంక్‌ లాకర్‌ డెడ్‌లైన్‌: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్‌.. 

మరిన్ని వార్తలు