ముంబై: రూపాయి పరుగు ఆగడం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ లాభపడింది. డాలర్ మారకంలో మంగళవారం 35 పైసలు బలపడి 74.66 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి నెల రోజుల గరిష్ట స్థాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 74.95 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 74.60 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ఒమిక్రాన్ ఆందోళనలు, క్రూడాయిల్ ధరల రికవరీతో ఒక దశలో 74.95 కనిష్టాన్నీ నమోదు చేసింది. గడిచిన తొమ్మిది సెషన్లో రూపాయి మొత్తం 162 పైసలు బలపడింది.
‘‘అంతర్జాతీయంగా డాలర్ కరెన్సీ స్తబ్ధుగా ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఫారెక్స్ ట్రేడర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలను రూపాయి అందిపుచ్చుకుంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పార్మర్ తెలిపారు.