TodayStockMarketUpdate: దలాల్ స్ట్రీట్‌లో హిండెన్‌బర్గ్‌ ప్రకంపనలు, 11 లక్షల కోట్ల ఢమాల్‌

27 Jan, 2023 18:50 IST|Sakshi

సాక్షి,ముంబై:  బ‌డ్జెట్‌కు ముందు, దేశీయ స్టాక్‌ మార్కెట్లకు అదానీ  షేర్ల పతనం సెగ కొనసాగుతోంది. శుక్రవారం అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం భారీగా కొనసాగడంతో కీలక సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి.  అలాగే బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఒక దశలో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 17500 స్థాయిని  కోల్పోయింది. 

చివర్లో కోలుకుని సెన్సెక్స్ 874.16 పాయింట్లు లేదా 1.45 శాతం క్షీణించి 59,330.90 వద్ద, నిఫ్టీ 287.60 పాయింట్లు లేదా 1.61 శాతం దిగువన 17,604 వద్ద ముగిసింది. ఫలితంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ముఖ్యంగా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో గ్రూపునకు చెందిన 7 కంపెనీల షేర్లు భారీ పతనాన్ని నమోదు చేసింది. రెండురోజులుగా కొనసాగుతున్న అమ్మకాల వెల్లువలో అదానీ మార్కెట్‌ క్యాప్‌ లక్షల కోట్లు  తుడుచు పెట్టుకుపోయింది. అదానీ పోర్ట్స్‌, అదానీఎంటర్‌ ప్రైజెస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆటో, ఫార్మా టాప్ గెయినర్లుగా ఉన్నాయి.  టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, డా.రెడ్డీస్‌, ఐటీసీ లాభపడగా, దివీస్‌,అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి.  అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభాల్లో  8 పైసలు ఎగిసింది.

మరిన్ని వార్తలు