రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!

6 Dec, 2023 11:32 IST|Sakshi

ప్రపంచంలోనే నంబర్‌వన్‌ బ్రాండ్‌గా ఎదిగిన యాపిల్‌ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ ఒక సంతకం విలువ ఏకంగా రూ.20 లక్షలు! అవును.. ఇది నిజమే 47 ఏళ్లు నాటి చెక్కుపై ఆయన పెట్టిన సంతకం కోసం తన అభిమానులు ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కేవలం నాలుగు డాలర్లు(రూ.333) రాసిఉన్న ఆ చెక్కుకు ఎందుకు అంత క్రేజో తెలుసుకుందాం.

‘ఆర్‌ఆర్‌ ఆక్షన్స్‌’ అనే సంస్థ తాజాగా ఓ చెక్కును వేలానికి ఉంచింది. ఇప్పటికే ఈ చెక్కును కొనేందుకు అనేక మంది బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ప్రకారం చూస్తే.. ఈ చెక్కు 25,000 వేల డాలర్ల (రూ.20 లక్షలకు పైనే)కు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఆ చెక్కుపై 4 డాలర్లే రానుండడం విశేషం. ప్రస్తుతం డాలర్‌ విలువతో పోలిస్తే దాని విలువ కేవలం రూ.333గా ఉంది. 1976లో కాలిఫోర్నియాలో స్టీవ్‌జాబ్స్‌, స్టీవ్‌ వోజ్నియాక్‌ కలిసి యాపిల్‌ సంస్థను స్థాపించారు. యాపిల్‌-1 కంప్యూటర్‌ కోసం వీరిద్దరూ పనిచేస్తున్న సమయంలో అదే ఏడాది జులై 23న జాబ్స్‌ ఓ చెక్కుపై సంతకం చేశారు. తాజాగా అమెరికాకు చెందిన ‘ఆర్‌ఆర్‌ ఆక్షన్స్‌’ సంస్థ స్టీవ్‌ జాబ్స్‌ సంతకం చేసిన ఈ చెక్కును ఇటీవల వేలానికి ఉంచింది. వేలం ప్రక్రియ డిసెంబరు 6న ముగియనుంది. అయితే ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ఆధారంగా చూస్తే స్టీవ్‌ సంతకానికి రూ.20 లక్షలకు పైనే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 

ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్‌

ఇంతకీ స్టీవ్‌ జాబ్స్‌ చేసిన సంతకానికి ఎందుకంత క్రేజ్‌ అనే సందేహం రావొచ్చు. సాధారణంగా జాబ్స్‌ ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేవారు కాదట. దాంతో ఆయన పూర్తి పేరుతో చేసిన సంతకం కావడంతో ఈ చెక్కుకు ఇంత క్రేజ్‌. ఇప్పటికే స్టీవ్‌ జాబ్స్‌కి సంబంధించిన అనేక వస్తువులను ఎన్నో సంస్థలు వేలానికి పెట్టాయి. యాపిల్‌ సంస్థ ప్రకటన కోసం ఆయన రాసిన పత్రాన్ని వేలం వేయగా.. 1,75,759 డాలర్ల(రూ.1.45 కోట్లు)కు అమ్ముడయింది.

>
మరిన్ని వార్తలు