3 రోజుల లాభాలకు బ్రేక్‌ 

8 Nov, 2023 02:11 IST|Sakshi

స్వల్ప నష్టాల ముగింపు  

విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల ప్రభావం

ముంబై: దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడంతో స్టాక్‌ సూచీల 3 రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. ఆసియా, యూరప్‌ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించారు. ట్రేడింగ్‌లో 383 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 16 పాయింట్ల స్వల్ప నష్టంతో 64,942 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 94 పాయింట్ల పరిధిలో కదలాడింది. ఆఖరికి ఐదు పాయింట్ల నష్టంతో 19,407 వద్ద నిలిచింది. చైనా అక్టోబర్‌ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు డేటా వెల్లడికావడంతో ఆసియాలో ఒక్క తైవాన్‌ తప్ప మిగిలిన అన్ని దేశాల స్టాక్‌ సూచీలు 2% నష్టపోయాయి. కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన, ఇంధన షేర్ల పతనంతో యూరప్‌ మార్కెట్లు ఒకశాతం మేర పతనమయ్యాయి. 

  • హోనాసా కన్జూమర్‌ లిస్టింగ్‌ పర్వాలేదనిపించింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.324) వద్దే లిస్టయ్యింది. చివరికి 4% లాభంతో రూ.337 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10,848 కోట్లుగా నమోదైంది. 
  • ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ చివరిరోజు నాటికి 73.15 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అ య్యింది. 5.77 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 422 కోట్ల ఈక్విటీలకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 173.52 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్ల కోటా 84.37 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 16.97 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి.
మరిన్ని వార్తలు