న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ షేర్ల ముఖ విలువను విభజించనుంది. వచ్చే నెల(మే) 3న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో షేర్ల విభజన అంశాన్ని బోర్డు పరిశీలించనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. గతేడాది(2021–22) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఆర్థిక ఫలితాలపై నిర్వహించనున్న సమావేశంలో బోర్డు రూ. 10 ముఖ విలువగల షేర్ల విభజనపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వివరించింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాటాదారులకు డివిడెండును సైతం ప్రకటించే వీలున్నట్లు తెలియజేసింది.
ఈ వార్తల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 1,340 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 1,358 వరకూ ఎగసింది.