టీసీఎస్‌ సంచలనం..5జీ..6జీ!!

23 Mar, 2022 10:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఐటీ దిగ్గజం టీసీఎస్‌ హెడ్‌ (కమ్యూనికేషన్, మీడియా..ఇన్ఫర్మేషన్‌ సర్వీసుల విభాగం) కమల్‌ భదాడా తెలిపారు. 

ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ ఇవ్వడంతో పాటు వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. దేశీ అవసరాలకు తగ్గట్లు నెట్‌వర్క్‌పై మరింతగా కసరత్తు చేస్తున్నామని కమల్‌ వివరించారు. ప్రస్తుతం చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్‌ వినియోగం మధ్యలో ఉండగా.. భారత్‌లో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు.

 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు మరో 3–4 ఏళ్లు పడుతుందని కమల్‌ తెలిపారు. అటు పైన 6జీ నెట్‌వర్క్‌ కోసం ప్రక్రియ ప్రారంభం కాగలదని వివరించారు.

చదవండి: దిమ్మతిరిగే స్పీడ్‌.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!!

మరిన్ని వార్తలు