అప్పుడే 6జీ టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్రం

10 Oct, 2021 20:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంకా 5జీ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రాకముందే అప్పుడే 6జీ టెక్నాలజీ మీద పనులు ప్రారంభించాలని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ పరిశోధన & అభివృద్ధి సంస్థ సీ-డీఓటీని ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా 6జీ, ఇతర భవిష్యత్ టెక్నాలజీల మీద పనులు ప్రారంభించాలని టెలికాం కార్యదర్శి కె రాజరామన్ కోరారు. ఇప్పటికే శామ్ సంగ్, హువావే, ఎల్ జీ కొన్ని ఇతర కంపెనీలు 6జీ టెక్నాలజీలపై పనిచేయడం ప్రారంభించాయి.

ఈ టెక్నాలజీ 5జీ కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందని, 2028-2030 మధ్య వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నట్లు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా భారతదేశంలో ట్రయల్స్ సమయంలో అత్యధిక గరిష్ట వేగం 3.7 జీబీపీలను సాధించినట్లు పేర్కొంది. దేశంలోని రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సెకనుకు 20 మెగాబిట్ వద్ద 4జీ టాప్ స్పీడ్ ను నమోదు చేసింది.

అక్టోబర్ 1న డీఓటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రాజరామన్ టెక్నాలజీ వాణిజ్యీకరణపై దృష్టి పెట్టాలని, వేగవంతమైన సాంకేతిక వాణిజ్యీకరణ కోసం సి-డిఒటిలో ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని సీ-డీఓటీకి సూచించారు. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాలు 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించాయి. ఇప్పుడు వాటితో పోటీగా మన దేశంలో కూడా నూతన టెక్నాలజీల పనిచేయాలని డీఓటీ పేర్కొంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్ డ్ రియాలిటీ కలిసిన XR టెక్నాలజీతో.. ఎంటర్‌టైన్‌మెంట్, మెడిసిన్, సైన్స్, విద్య, తయారీ పరశ్రమల బౌండరీలను 6జీ పెంచనుంది.
 

మరిన్ని వార్తలు