టెలికాం సంస్థలకు ఝలక్‌..రీఛార్జ్‌ ప్లాన్స్‌పై క్లారిటీ ఇవ్వండి:ట్రాయ్‌

1 Apr, 2022 07:13 IST|Sakshi

నెలవారీ ప్లాన్లపై ట్రాయ్‌ వివరణ 

న్యూఢిల్లీ: నెలవారీగా రీచార్జి చేసుకునే ప్లాన్‌ ఒక్కటైనా అందించాలంటూ టెల్కోలకు ఇచ్చిన ఆదేశాలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా స్పష్టతనిచ్చింది. ప్రతి నెలా అదే తేదీన రెన్యూ చేసుకునేలా ఈ ప్లాన్‌ ఉండాలని సూచించింది. ఒకవేళ తదుపరి నెలలో ఆ తేదీ లేకపోయిన పక్షంలో అదే నెల ఆఖరు రోజే రెన్యువల్‌ తేదీగా ఉంటుందని స్పష్టం చేసింది. ఉదాహరణకు రెన్యువల్‌ చేసుకోవాల్సిన తేదీ జనవరిలో 31గా ఉంటే, తదుపరి రీచార్జి ఫిబ్రవరి 28 లేదా 29గాను (లీప్‌ ఇయర్‌పై ఆధారపడి), ఆ తర్వాత రెన్యువల్‌ తేదీ మార్చి 31, తదుపరి ఏప్రిల్‌ 30.. ఇలా ఉంటాయి.

ఇలా రీచార్జ్‌ చేసుకునేందుకు వీలుండేలా ప్రతీ టెలికం సంస్థ కనీసం ఒక్క ప్లాన్‌ వోచర్, ఒక స్పెషల్‌ టారిఫ్‌ వోచర్, ఒక కాంబో వోచర్‌ అయినా అందుబాటులో ఉంచాలని ట్రాయ్‌ సూచించింది. వివరణ నేపథ్యంలో ఆదేశాల అమలు కోసం టెల్కోలకు 60 రోజుల వ్యవధి ఇస్తున్నట్లు ట్రాయ్‌ అడ్వైజర్‌ కౌశల్‌ కిశోర్‌ తెలిపారు. ఒక్కో నెలలో ఒక్కో విధంగా రోజుల సంఖ్య ఉంటుంది కాబట్టి ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్‌ చేసే విధంగా ప్లాన్‌ను ప్రవేశపెట్టడం సంక్లిష్టంగా కనుక దీనిపై స్పష్టతనివ్వాలంటూ టెల్కోలు కోరిన మీదట ట్రాయ్‌ ఈ వివరణ ఇచ్చింది. రిలయన్స్‌ జియో ఇప్పటికే ఈ తరహా ప్లాన్‌ను రూ. 259కి ప్రవేశపెట్టింది.   
 

చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌..! ఎన్నడూ లేని విధంగా యూజర్లకు బెనిఫిట్స్‌..!

మరిన్ని వార్తలు