వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు

7 Aug, 2020 05:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది.

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్‌ క్వార్టర్‌లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్‌డౌన్‌ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్‌ టక్కర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు