ఇంటి నుంచి బయటికెళ్లిన బాలిక అదృశ్యం

18 Sep, 2020 10:43 IST|Sakshi

సాక్షి, మేడ్చల్: సైకిల్‌ తొక్కుకుంటూ ఇంటినుంచి బయటికెళ్లిన ఓ బాలిక అదృశ్యం కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. జిల్లాలోని నేరెడ్‌మేట్ కాకతీయ నగర్‌లో గురవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగుచూసింది. కాకతీయ నగర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నసుమేధ కపురియా (12) నిన్న సాయంత్రం సైకిల్ తీసుకొని బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తిగిరి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాలిక ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, నిన్న కురిసిన భారీ వర్షానికి దీన్‌ దయాళ్‌ నగర్‌లో నాళాలు పొంగిపొర్లాయని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో నాలా వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీంలతో గాలింపు చేపట్టగా బాలిక సైకిల్‌ కనిపించింది. సుమేధ నాలాలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖైరాలీ పబ్లిక్‌ స్కూల్‌లో సుమేధ 5 వ తరగతి చదుతున్నట్టు తెలిసింది.
(చదవండి: ప్రగతి భవన్‌: ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం)

కిడ్నాప్‌ చేశారు..!
బాలిక గల్లీలో ఉన్నపెద్ద నాలాలో పడి ఉండొచ్చనే అనుమానంతో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స‌హాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు  ముమ్మరం చేశారు. అక్కడ ఉన్న ఓపెన్ నాలాలో బాలిక సైకిల్ లభించడంతో మోరీపై ఇళ్ల ముందున్న పైకప్పును తొలగంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తమ పాప నాలాలో పడి తప్పిపోయిందని అనుకోవడం లేదని బాలిక తల్లి సుకన్య చెప్తున్నారు. ఎవరైనా తమ బిడ్డను కిడ్నాప్ చేశారేమోనని భావిస్తున్నట్టు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక ఆచూకీ కోసం అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(చదవండి: కరోనాతో మాదాపూర్‌ ఎస్‌ఐ మృతి)

మరిన్ని వార్తలు