అమీన్‌పూర్‌‌ ఘటన: రహస్య విచారణ

17 Aug, 2020 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమీన్‌పూర్ ఆశ్రమ ఘటనకు సంబంధించి పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను ఆశ్రమానికి తరలించి పఠాన్ చెరువు డీఎస్‌పీ విచారణ చేస్తున్నారు. పోలీస్ కస్టడీ విచారణ విషయాలు బయటకు తెలియకుండా అత్యంత గోప్యంగా విచారణ జరుగుతోంది. నిందితులను ఆశ్రమంలోనే ఉంచి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఆశ్రమ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమానికి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే బాధిత కుటుంబం హైపర్ కమిటీ ముందు హాజరై తమ వాగ్మూలం ఇచ్చింది. ఫోక్సో కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చెయ్యాల్సింది పోయి అధికారులు ఆలస్యం చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. (అమీన్‌పూర్‌ కేసు స్వాతి లక్రాకు అప్పగింత)

కాగా, అమీన్‌పూర్‌లోని మియాపూర్‌ శివారు ప్రాంతంలోని మారుతి అనాథాశ్రమం బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్‌ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి  వెలుగులోకి వస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు