భార్యపై అనుమానం.. నిద్రిస్తుండగా దారుణం

10 Mar, 2021 19:26 IST|Sakshi

భోపాల్‌: భార్యపై అనుమానం అతడిని రాక్షసుడిగా మార్చింది. విచక్షణ కోల్పోయి కట్టుకున్న భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. గొడ్డలితో ఆమె కాలు, చేయ్యి నరికాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. హోషంగాబాద్‌లోని సియోని మాల్వాకు చెందిన ప్రీతం సింగ్‌కు 2012లో సంగీతతో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. సంగీత ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తుండగా.. ప్రీతం సింగ్‌ కుమారుడితో కలిసి నిష్తాపూర్‌ ప్రాంతంలోని పరాస్‌ నగర్‌లో ఉంటుండేవాడు. దినసరి కూలీగా పని చేస్తుండేవాడు. ఇలా  ఏడేళ్లుగా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి అనుమానం అనే రాక్షసి ప్రవేశించింది. దాంతో కాపురంలో కలతలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సంగీత సెలవు మీద భోపాల్‌కి వచ్చింది. కుమారుడితో కలిసి సంతోషంగా గడిపింది. ఇక రాత్రి బిడ్డతో కలిసి నిద్ర పోతుండగా.. ప్రీతం సింగ్‌ గొడ్డలి తీసుకుని సంగీత కుడి చేయి, కాలు నరికాడు. దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రీతం సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని వెల్లడించాడు. సంగీతను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు