Outer Ring Road-GHMC Contract Labour: ఔటర్‌రింగు రోడ్డుపై దుర్ఘటన.. మొక్కలకు నీరు పడుతుండగా..

28 Jan, 2022 01:41 IST|Sakshi
ఘటనా స్థలంలో పరిశీలిస్తున్న పోలీసులు 

ఇద్దరు కార్మికుల మృతి 

జిన్నారం (పటాన్‌చెరు): మొక్కలకు నీరు పడుతున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం సంగారెడ్డి జిల్లా బొల్లారం సమీపంలో ఔటర్‌రింగు రోడ్డుపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన కంటిగారి సత్తయ్య (50) జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిజామాబాద్‌ జిల్లా తడ్వాయ్‌ గ్రామానికి చెందిన పాపల నవీన్‌ (19) లారీ ట్యాంకర్‌ క్లీనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

వీరిద్దరూ రోజులాగే జిన్నారం మండలంలోని బొల్లారం సమీపంలో ఓఆర్‌ఆర్‌పై మొక్కలకు ట్యాంకర్‌లో తీసుకువచ్చిన నీళ్లు పోస్తున్నారు. అదే సమయంలో రామచంద్రాపురానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి కారులో వేగంగా వస్తూ మొక్కలకు నీళ్లు పోస్తున్న నవీన్, సత్తయ్యలను ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి ట్యాంకర్‌నూ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మహేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు