కేసు నుంచి తప్పిస్తా.. కానీ ఖర్చవుతుంది: ఎస్‌ఐ మరో అవతారం!

9 Oct, 2022 15:12 IST|Sakshi

యశవంతపుర(బెంగళూరు): కేసు నుంచి తప్పిస్తామంటూ భారీ మొత్తాల్లో లంచం తీసుకుంటూ బెంగళూరు ఉత్తర తాలూకాలోని చిక్కజాల ఎస్‌ఐ ప్రవీణ్‌తో పాటు కానిస్టేబుల్‌ రవిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. రవిని లోకాయుక్త అరెస్ట్‌ చేయగా ఎస్‌ఐ ప్రవీణ్‌ తప్పించుకున్నారు. వివరాలు... ప్రకాశ్‌ అనే ఒక కాంట్రాక్టర్‌పై చిక్కజాల పోలీసుస్టేషన్‌లో కేసు ఉంది.

కేసుపై కోర్టులో చార్జిషీట్‌ వేయడంపై మాట్లాడడానికి ప్రకాశ్‌ మామ దేవరాజును కానిస్టేబుల్‌ రవి కలిశాడు. ప్రకాశ్‌ను కేసు నుంచి తప్పించాలంటే రూ. 3.70 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఎస్‌ఐ ప్రవీణ్‌కు 3.50 లక్షలు, ఇద్దరు స్టేషన్‌ రైటర్లకు తలా రూ. 10 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉందన్నాడు. సరేనని దేవరాజు సదరు మొత్తాన్ని రవికి ఇచ్చాడు. కానీ కేసులో ఎలాంటి పురోగతి కనపడలేదు. దేవరాజు వెళ్లి రవిని కలిసి ఇదే అడిగాడు.  

మరో రూ. 5 లక్షలకు డిమాండ్‌  
ఇది చాలా పెద్ద కేసు, మరో రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రకాశ్‌కు మరో షాక్‌ తగిలింది. డబ్బులు ఇవ్వని కారణంగా ఎస్‌ఐ ప్రవీణ్‌ కాంట్రాక్టరు కుటుంబానికి తక్షణం విచారణకు రావాలని నోటీసులు పంపాడు. తీవ్ర ఆక్రోశానికి గురైన దేవరాజు లోకాయుక్తను ఆశ్రయించాడు.  రవి, ప్రవీణ్‌లు కలిసి దేవరాజును లంచం డబ్బుతో చిక్కజాల పోలీసుస్టేషన్‌ వద్దకు పిలిపించుకున్నారు. రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు తక్షణం రవిని అరెస్ట్‌ చేయగా ఎస్‌ఐ ప్రవీణ్‌ పరారయ్యాడు. ఫోన్లో ఏసీబీ అని వినబడడంతో రవి తప్పించుకోగలిగాడు. అతని కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: అపరిచితుడితో ఫోన్‌లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..

మరిన్ని వార్తలు