కరోనా భయంతో వివాహిత ఆత్మహత్య

18 Aug, 2020 08:35 IST|Sakshi

గొల్లపల్లి(ధర్మపురి): కరోనా భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండంలోని బొంకూర్‌ గ్రామంలో సోమవారం విషాదం నింపింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన మాదాసు మల్లేశం–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురు నారా మేఘన(22) బీఫార్మసీ చదువుకుంది. ధర్మారం మండలకేంద్రానికి చెందిన నారా మధుసూదన్‌కు ఇచ్చి రెండునెలలక్రితం వివాహం చేశారు. పెళ్లింట్లో, తల్లి గారింట్లో ఎలాంటి గొడవలు లేవు. పెళ్లి అయిన కొద్దిరోజులకు హైదరాబాద్‌ వెళ్లారు. మేఘన ఫార్మసీలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త ప్రైవేట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. (ట్విట్టర్‌ ద్వారా వెల్లడించిన బయోకాన్‌ ఎండీ)

వారంక్రితం జ్వరంకాగా జగిత్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించాడు. కరోనా లక్షణాలు లేవనిచెప్పినప్పటికీ తల్లిగారింటికి  వెళ్లానని చెప్పడంతో భర్త బొంకూర్‌లో దింపి వెళ్లాడు. టైపాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్న మేఘన కరోనా అనుమానంతో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూపడుకుని నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసే సరికి శవమై కనిపించింది. కరోనా వచ్చిందేమోననే భయంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మేఘన తండ్రి మాదాసు పెద్దమల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్‌ నవీన్‌ పంచనామా నిర్వహించడంతో ఎస్సై జీవన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లి అయిన రెండునెలలకే మేఘన ఆత్మహత్యకు పాల్పడడంతో రెండుకుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులరోదనలు మిన్నంటాయి. 

మరిన్ని వార్తలు