భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి

17 Dec, 2021 12:54 IST|Sakshi
నిందితుల అరెస్ట్‌ చూపుతున్న ఏఎస్పీ శ్రీనివాస్‌

సాక్షి, మహదేవపూర్‌(వరంగల్‌): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చేలా చేసింది. మండంలంలోని కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈనెల 8న అన్నారం గ్రావిటీ కెనాల్‌లో లభ్యమైన గుర్తుతెలియని మహిళా శవం కేసును ఛేదించినట్లు జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ వెల్లడించారు. అయితే, అంతకుముందే కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో మహిళ అదృశ్యమైన కేసు ఉంది.

ఆ దిశగా పోలీస్‌లు విచారణ చేపట్టగా గురువారం ఉదయం మహదేవపూర్‌ మండలంలోని పెద్దంపేట గ్రామశివారులో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన రేగుల సౌజన్యతో భర్త రేగుల తిరుపతి భూపాలపల్లికి వెళ్లడానికి ఈ నెల 6న పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మైదబండాకు చెందిన తన బావమరిది ఎర్రం సురేష్‌ కారు అద్దెకు తీసుకుని వెళ్తూ మార్గమధ్యలో సౌజన్య స్నేహితురాలైన వెంకటేశ్వరిని కారులో ఎక్కించుకుని వెళ్లారు.

అయితే తిరుపతికి భార్య సౌజన్యపై అనుమానం ఉండడంతో ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం తిరుగు ప్రయాణంలో మెడిపల్లి అటవీ ప్రాంతంలో భార్య సౌజన్యను వివస్త్రను చేసి ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని  అన్నారం గ్రావిటీ కాల్వలో పడేసి ఆమె దుస్తులు మంథని శివారు ప్రాంతం భట్టుపల్లి వద్ద దహనం చేసి పారిపోయినట్లు నేరం ఒప్పుకున్నారు.

మృతురాలికి పాప, బాబు ఉన్నారు. ఇదివరకే తిరుపతిపై వరకట్నం కేసు, మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పేరుతో డబ్బులు సంపాదించిన కేసులు ఉన్నాయని ఏఎస్పీ శ్రీనివాసులు  వెల్లడించారు. ఈ సమీక్షలో మహదేవపూర్‌ డీఎస్పీ బోనాల కిషన్, సీఐ కిరణ్, ఎస్సై రాజ్‌కుమార్, కాళేశ్వరం ఎస్సై ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు.  

చదవండి: మరదలిని లోబర్చుకుని.. భార్యకు పిల్లలు పుట్టకుండా చేసి

>
మరిన్ని వార్తలు