తండ్రిని బలిగొన్న కొడుకు ప్రేమ వ్యవహారం

30 Oct, 2020 20:46 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల/కరీంనగర్‌ : జిల్లాలోని బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది. వివరాలు.. బోయినిపల్లి మండలం  స్తంభంపల్లి లో తునికి మహేష్ , ఎదురింట్లో ఉండే అమ్మాయి గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దసరా రోజున పారిపోయారు. మరోవైపు పండుగ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చితార్థం ఉంది.ఇంతలోనే మహేష్ గౌతమిని తీసుకుని పారిపోయాడని అమ్మాయి బంధువులు ఆగ్రహించారు. దీంతో ఆగ్రహంతో మహేష్‌ ఇంటికి వెళ్లి  అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అబ్బాయి తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టారు.‌

దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్బాయి తండ్రి లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురికావడంతో వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.  అమ్మాయి బంధువులు కొట్టడంతోనే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుని భార్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా పారిపోయిన ప్రేమజంట ఆచూకి మాత్రం లభించలేదు. ప్రేమించిన పాపానికి తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుని భార్య డిమాండ్ చేస్తుంది.


లక్ష్మీనారాయణ (ఫైల్‌ ఫోటో)

మరిన్ని వార్తలు