HYD: డీఎల్‌ఎఫ్‌ ఫుడ్‌ కోర్టుల్లో తనిఖీలు.. విస్తుపోయే అంశాలు

11 Dec, 2023 21:04 IST|Sakshi

కుళ్లిపోయిన పండ్లతో జ్యూసులు..
నాసిరకం పన్నీరుతో రకరకాల వంటకాలు.. 
కూరలు, గ్రేవీల్లో నాసిరకం మసాలాలు..
కలర్‌ కలిపిన టీ పొడితో ఛాయ్‌..
వంటనూనె నాణ్యతలోనూ లేని కనీస ప్రమాణాలు..

ఇక శుభ్రత సంగతి అంటారా? బాబోయ్‌..
ఇవీ హైదరాబాద్‌ డీఎల్‌ఎఫ్‌ ఫుడ్‌ కోర్టుల్లో తాజాగా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ విషయాలు. 


అర్ధరాత్రి దాకా కూడా వేడి వేడి ఆహారం కోసం ఐటీ ఉద్యోగులు సహా ఆహార ప్రియుల సందడి కనిపిస్తుంటుందక్కడ. రేటు ఎంతైనా ఫర్వాలేదనుకునే జనాలే ఎక్కువ కనిపిస్తారక్కడ. వాళ్లకు తగ్గట్లే పుట్టగొడుగుల్లా ఫుడ్‌కోర్టులు వెలిశాయి. కానీ, ఆ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు వెంపర్లాడుతున్న ఫుడ్‌ కోర్ట్‌ సెంటర్‌ నిర్వాహకులు, కనీస నాణ్యతా ప్రమాణాలు మాత్రం పాటించడం లేదు. న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ను అందించొద్దనే నిబంధనల నుంచి..  కంప్లయింట్‌ కోసం ఉద్దేశించిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సైతం ప్రస్తావించకుండా వ్యవహరిస్తున్నారు. 

తాజాగా.. డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన పళ్లతో రసాలు చేసి విక్రయిస్తుండడం.. అలాగే నాసిరకం మసాలాలతో ఆహార పదార్థాల తయారీ, టీ పొడిలో కలర్ గ్రాన్యూల్స్ కలిపి టీ విక్రయాలు(ఇది క్యాన్సర్‌కు దారి తీయొచ్చని ప్రచారం నిపుణులు చెబుతుంటారు).  డీఎల్ఎఫ్ సమీపంలో ఫుడ్ కోర్టుల్లో ఆహార నాణ్యతపై ట్విటర్‌లో అందించిన ఫిర్యాదు మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. 

డీఎల్‌ఎఫ్‌ వద్ద సుమారు 150 ఫుడ్‌ కోర్టులు ఉండగా.. అందులో చాలావాటికి అనుమతులు లేవు. దీంతో ఆయా యజమానులకు నోటీసులు జారీ చేశారు. 

>
మరిన్ని వార్తలు