పాణాలు తీసిన ప్రహరీ

22 Jul, 2022 09:06 IST|Sakshi

కృష్ణరాజపురం: భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌ గోడ కూలి నలుగురు కూలీ కార్మికులు మరణించారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి హోబళి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపార్టుమెంట్‌ వద్ద జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు.

గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గోడ పక్కనే వేసుకున్న తాత్కాలిక షెడ్‌లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గోడ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన మనోజ్‌ కుమార్‌ (35), రామ్‌కుమార్‌ (25), నితీశ్‌ కుమార్‌ (22), మణితన్‌ దాస్‌ అనే నలుగురు తీవ్రగాయాలతో మరణించారు.  

నాసిరకం నిర్మాణం 
నిర్మాణంలో ఉన్న  అపార్టుమెంట్‌లో కూలీ కార్మికులు పనిచేస్తున్నారు. కారి్మకులు ఉండేందుకు తాత్కాలికంగా షెడ్‌ను నిర్మించారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం, అలాగే పక్కనే ఉన్న రాజకాలువ పొంగడంతో ప్రమాదం జరిగింది.

ప్రహరీని రాజకాలువను ఆక్రమించి, నాసిరకంగా కట్టినట్లు సమాచారం. ఎలాంటి పునాది లేకుండా ఆ కాంపౌండ్‌కు ఆనుకుని షెడ్‌ను నిర్మించారు. దీంతో వర్షానికి తడిసిన ఆ కాంపౌండ్‌ గోడ పేకమేడలా షెడ్డుమీద కూలి పోయింది.  

నలుగురికి తీవ్రగాయాలు  
ఈ ప్రమాదంలో సునీల్‌ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేశ్‌ అనే నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైట్‌ఫీల్డ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎంటీబీ నాగరాజు, ఎస్పీ పురుషోత్తమ్, డీఎస్పీ పి.ఉమాశంకర్‌ పరిశీలించారు.  

(చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్‌ )

మరిన్ని వార్తలు