అమ్మమ్మ ఇంట్లో మనవరాలి చోరీ

5 Nov, 2020 10:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు నిందితుల అరెస్టు.. రూ.7.2లక్షల సొత్తు రికవరీ

ఆభరణాలు స్నేహితుడికి ఇచ్చిన మనవరాలు

నేరేడ్‌మెట్‌ : సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీ చేసిన మనవరాలితోపాటు ఆమె స్నేహితుడిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి  తెలిపిన మేరకు.. కేశవనగర్‌కు చెందిన డీజే ఆపరేటర్‌  పర్షా అజయ్‌(21),  దమ్మాయిగూడలోని వీఆర్‌ఆర్‌ ఎన్‌క్లేవ్‌లో  నివాసం ఉంటున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ పట్రిసియా(21)లు రెండేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. పట్రిసియా తన బంగారు గొలుసు ఇవ్వగా అమ్మేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అజయ్‌  డబ్బుల కోసం స్నేహితురాలి సొంత అమ్మమ్మ అమిలియా ఇంట్లో చోరీకి పధకం వేశారు. ఇందులో భాగంగా గత నెల 31వ తేదీన డిఫెన్స్‌ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి మనవరాలు పట్రిసియా వెళ్లి అక్కడే ఉంది.

అదే రోజు అర్థరాత్రి అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సుమారు 18  తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది.  తన స్నేహితుడు అజయ్‌కు ఫోన్‌ చేసి డిఫెన్స్‌ కాలనీకి పిలిపించి చోరీ చేసిన అభరణాలను అప్పగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి  పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.  పట్రిసియా, అజయ్‌లు నిందితులుగా తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి, చోరీ సోత్తును పోలీసులు రికవరీ చేశారని డీసీపీ చెప్పారు.  

బాలికపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు
చైతన్యపురి: మైనర్‌ బాలికపై అఘాయిత్యం చేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. న్యూమారుతీనగర్‌లో నివసించే తంగళ్లపల్లి మణికంఠ (20)ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్‌ఫోన్‌ ద్వారా పద్నాలుగు సంవత్సరాల ఓ మైనర్‌ బాలికతో పరిచయం పెంచుకున్నాడు.  తరచూ ఫోన్‌లో మాట్లాడే వాడు. గత శుక్రవారం మాయమాటలు చెప్పి  బాలికను మన్సూరాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుడు మణికంఠను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు