ఎస్‌ఐ సూసైడ్‌: జైలుకు బ్యూటీషియన్‌

20 Jan, 2021 19:01 IST|Sakshi

వ్యక్తిగత కారణాల వల్లే మరణించాడు

దేవినేని ఉమ వ్యాఖ్యలను ఖండించిన డీఎస్పీ సత్యానందం

సాక్షి, విజయవాడ: గుడివాడ టూటౌన్‌ ఎస్‌ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు బ్యూటీషియన్‌ సురేఖను పోలీసులు ఇదివరకే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా గుడివాడలో డీఎస్పీ సత్యానందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆత్మహత్య వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్‌ కుమార్‌ వ్యక్తి గత కారణాల వల్లే మరణించాడని తెలిపారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడిలకు తట్టుకోలేక మృతిచెందాడని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడం అవాస్తవమని స్పష్టం చేశారు. దేవినేని ఉమ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. పోలీసులను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. ఎస్‌ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పిల్లి విజయ్‌కుమార్‌(34)కు రెండున్నర నెలల క్రితం ఏలూరుకు చెందిన యువతితో వివాహమైంది. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రస్తుతానికి ఎస్‌ఐ ఒక్కడే అద్దెకుంటున్నాడు. అతడికి హనుమాన్‌ జంక్షన్‌లో పని చేస్తున్న సమయంలో సురేఖ అనే బ్యూటీషియన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సురేఖ భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం వీఆర్‌లో ఉంచారు.

తిరిగి గుడ్లవల్లేరులో ఎస్‌ఐగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మండవల్లిలో పనిచేసిన ఆయన ఇటీవల గుడివాడకు బదిలీ అయ్యారు. కాగా, విజయ్‌ కుమార్‌ భార్యను కాపురానికి తీసుకురావద్దని, తనతోనే ఉండాలని సురేఖ తరచూ గొడవ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో సురేఖ.. విజయ్‌కుమార్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అతనితో ఇదే అంశంపై గట్టిగా ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 'నీవు నీ భార్యకు విడాకులు ఇవ్వని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుని సూసైడ్‌ నోట్‌లో నీవే కారణమని తెలుపుతాను' అనిహెచ్చరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎస్‌ఐ తన గదిలోని ఫ్యాన్‌ హుక్‌కు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (చదవండి: గుడివాడ టూ టౌన్‌ ఎస్సై బలవన్మరణం)

మరిన్ని వార్తలు