ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య 

17 Jun, 2022 09:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లికి చెందిన ఓదెలు కుమారుడు నారుకట్ల రమేష్‌ (26) బీటెక్‌ పూర్తి చేసి గచ్చిబోలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

చదువుకునే సమయంలో స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గురువారం ఘట్కేసర్‌–చర్లపల్లి స్టేషన్ల మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు