వేకువన పెళ్లి.. సాయంత్రం ప్రమాదం.. అదృష్టవశాత్తు..

14 Dec, 2021 13:15 IST|Sakshi

సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): సోమవారం వేకువన పెళ్లి చేసుకున్న ఓ జంట అదే రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు గాయాలతో ఇరువురూ బయట పడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అదే గ్రామం వెలమ తోటకు చెందిన జి.శంకరరావు, టెక్కలి మండలం తలగాంకు చెందిన ఢిల్లీశ్వరి(స్వప్న)కు సోమవారం వేకువన 4 గంటలకు వివాహమైంది.

వివాహం అనంతరం అత్తవారింటిలో అడుగు పెట్టేందుకు నూతన వధూవరులు కారులో వచ్చారు. ఈ కార్యక్రమం అయ్యాక తిరుగు ప్రయాణంలో గట్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ముందున్న లారీని అధిగమించే ప్రయత్నంలో కారు మరో లారీని ఢీ కొట్టింది. దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధూవరులకు గాయాలు కాగా.. వరుడు శంకరరావుకు బలమైన దెబ్బలు తగిలాయి.

వీరితో పాటు పెళ్లి కుమార్తె మేనత్త జ్యోతి, డ్రైవర్‌ బాలాజీలు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఎస్‌ఎఫ్‌ జవాను మాధవరావు అటుగా వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. వధూవరుల వద్ద ఉన్న ఆభరణాలను జాగ్రత్త చేసి వారికి అప్పగించారు. క్షతగాత్రులు ప్రస్తుతం నరసన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  

చదవండి: Karimnagar: బ్యూటీషియన్‌ అదృశ్యం

మరిన్ని వార్తలు