హోటల్‌లో ఎవరికి తెలియకుండా పెళ్లి..  కారులో బలవంతంగా ఎక్కించుకుని..

29 Nov, 2021 15:40 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు.. మంచి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్‌ సైట్లపై ఆధారపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక బిజినెస్‌గా మారింది. అయితే, కొందరు కేటుగాళ్లు సైట్లలో నకిలీ ఫ్రోఫైళ్లను సృష్టించి ఎదుటివారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా మనం వార్తల్లో చూస్తున్నాం. తాజాగా,  ఇలాంటి కోవకు చెందిన ఉదంతం​ కర్ణాటకలో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ భౌరో పాటిల్‌(31) అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్‌ వేదికగా ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఆమెతో రోజు చాట్‌ చేసేవాడు. ఆ నిందితుడు తాను.. ఒక ఆర్మీ ఆఫీసర్‌ అని చెప్పుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన సదరు యువతి.. అతని మాయలో పడిపోయింది.

ఆ తర్వాత.. వీరు గత నవంబరు 18న బెంగళూరులోని ఒక ఆలయంలో కలిశారు. అప్పుడు ప్రశాంత్‌ పాటిల్‌ ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు.  వీరిద్దరు స్థానికంగా ఉన్న ఒక లాడ్జీలో పెళ్లి చేసుకున్నారు. కాగా, వివాహం గురించి ఎవరికి చెప్పనని యువకుడు.. వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని కారులో ఎక్కించుకుని.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు యువతి ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టేశాడు.

ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన ప్రశాంత్‌ పాటిల్‌ ఆన్సర్‌ చేయలేదు. దీంతో యువతి తాను.. మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు ప్రశాంత్‌ పాటిల్‌పై 2018 నుంచి పూనా, లాతూర్‌, అహ్మద్‌ నగర్‌లలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుడు.. మ్యాట్రిమోనియల్‌ వేదికగా చాలా మంది యువతులను మోసం చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై పలుసెక్షన్‌ల కింద కేసులను నమోదుచేసిన పోలీసులు స్థానిక కోర్టులో హజరుపర్చారు. 
 

మరిన్ని వార్తలు