బండ్లగూడ ప్రమాదం: లైసెన్స్‌ లేదు.. బర్త్‌డే నాడు దోస్తులతో హుషారుగా వెళ్తూ..

4 Jul, 2023 19:15 IST|Sakshi

సాక్షి, క్రైమ్‌: బండ్లగూడ సన్‌సిటీ దగ్గర ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.  నిర్లక్ష్యంగా కారు నడిపి రెండు ప్రాణాల్ని బలిగొన్న బద్రుద్దీన్ ఖాదిరి దగ్గర అసలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. తన పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో వెళ్తున్న క్రమంలోనే ఈ యాక్సిడెంట్‌కు కారణం అయ్యాడు ఆ టీనేజర్‌.

ఇక ప్రమాదానికి కారణమైన హోండా సివిక్‌ కారు పద్దతి ప్రకారం చేతులు మారలేదని తెలుస్తోంది. గతంలో ఈ కారును మహ్మద్‌ ఇయాజ్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో అమ్మేశాడు. ఓఎల్‌ఎక్స్‌ డీలర్‌ నుంచి మరో వ్యక్తి ఆ కారు కొనుగులు చేయగా.. సదరు వ్యక్తి నుంచి బద్రుద్దీన్ ఖాదిరి కారు కొనుగోలు చేశాడు. అయితే.. ఇప్పటివరకూ ఆ హోండా సివిక్‌కారు పేపర్లు, అడ్రస్‌ మారలేదు. దీంతో ఇయాజ్‌ను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ప్రమాదానికి కారణమైన కారు

హైదరాబాద్‌ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఆర్మీ స్కూలు వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాక్‌కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్‌ సన్‌ సిటీ వద్ద AP09 BJ 2588 నెంబర్‌ గల హోండా సివిక్‌ ఎర్ర కలర్‌ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా.. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. మరో మహిళ మాళవిక తీవ్రంగా గాయపడ్డారు.  బాధితులది బండ్లగూడ లక్ష్మీనగర్‌. గాయపడిన మాళవికను మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో చేర్చించి.. చికిత్స అందిస్తున్నారు. 

బర్త్‌డే వేడుకల కోసం వెళ్తూ..
బద్రుద్దీన్ ఖాదిరి తన మిత్రులతో కలిసి తన 19వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు మొయినాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బద్రుద్దీన్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రాణాలను తీసిన కేసులో బద్రుద్దీన్ నార్సింగి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: వాహనాలను తొక్కుంటూ 10 మందిని బలిగొన్న ట్రక్కు

మరిన్ని వార్తలు