ఐసిస్‌ మాడ్యూల్‌ నేత సహా 15 మంది అరెస్ట్‌

10 Dec, 2023 06:24 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్‌ మాడ్యూల్‌ సూత్రధారి సాకిబ్‌ నచాన్‌ కూడా ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్‌లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు.

మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్‌ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్‌ఫోన్లు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

>
మరిన్ని వార్తలు