ప్రభుత్వంలో చేరమన్నారు.. మాట మార్చారు: అజిత్‌ పవార్‌

2 Dec, 2023 16:51 IST|Sakshi

ముం‍బై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్‌​ పవార్‌ అనుమతితోనే తాను ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో చేరినట్లు వెల్లడిం‍చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. 

అయితే, అజిత్‌ పవార్‌.. రెబల్‌ ఎన్సీపీ పార్టీ వర్గాలకు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ.. తాను అధికార పార్టీ ప్రభుత్వంలో చేరే ముందు శరద్‌ పవార్‌తో సమాలోచనలు చేసినట్లు తెలిపారు. అ‍నంతరం ఆయన తన ఆలోచన మార్చుకున్నట్లు పేర్కొన్నారు. తన నిర్ణయం గురించి శరద్‌ పవార్‌కి తెలియజేశానని.. అదేవిధంగా జూలై 2 ముందు, ఆ తర్వాత కూడా ఆయనతో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలిపారు. 

అయినా ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం తనను పిలిచి షిండే ప్రభుత్వంలో చేరమన్నారని వెల్లడించారు. మా నలుగురు కుటుంబ సభ్యులుకు తప్ప ఆయన రాజీనామా గురించి ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ఆయన్న రాజీనామా చేయాలని ఎవరు ఒత్తిడి చేయలేదని.. ఆయనే స్వతంత్రంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయనకు రాజీనామా చేయాలనే ఉద్దేశము లేనప్పుడు ఈ విషయాన్ని అంత పెద్దది చేయడం ఎందుకని ప్రశ్నించారు.

అదే విధంగా తాను, జయంత్‌ పాటిల్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌లతో కలిపి 12 పార్టీలకు చెందిన నేతలం ప్రభుత్వంలో చేరే విషయంపై శరద్‌ పవార్‌తో ప్రత్యక్షంగా మాట్లాడలేక సుప్రియా సోలేను సంప్రదించామని తెలిపారు. శరద్‌ పవార్‌ను ఒప్పిస్తానని తెలిపిన సుప్రియా వారం రోజుల గడువు అడిగిందని, అనంతరం తమకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదని వివరించారు. కాగా, అజిత్‌ పవార్‌.. ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో ఎనిమిది మంది రెబెల్‌ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో జూలై 2న చేరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు