Odisha Crime: ఒడిశాలో దారుణం.. భార్య, రెండేళ్ల కూతురు గదిలో విష సర్పాన్ని వదిలి

24 Nov, 2023 11:20 IST|Sakshi

ఒడిశాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, రెండేళ్ల కూతురుపట్ల ఓ వ్యక్తి కాలయముడిగా మారాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో అత్యంత్య హేయంగా వారిద్దరిని అంతమొందించాడు. నెలన్నర క్రితం జరిగిన ఈ అమానుష ఘటనలో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. 

గంజయ్‌ జిల్లా కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధెగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేష్‌ పత్రాకు బసంతి(23) అనే యువతి 2020లో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె దేవస్మిత ఉంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారిని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. గత నెల అక్టోబర్‌ 6న పాములు ఊదే వ్యక్తి నుంచి విషపూరిత సర్పాన్ని ప్లాస్టిక్‌ డబ్బాలో ఇంటికి తీసుకొచ్చాడు.

ఆ పామును భార్య, కూతురు నిద్రిస్తున్న గదిలో వారి మంచం వద్ద వదిలిపెట్టాడు. అతడు మరో గదిలో నిద్రించాడు. ఉదయం అయ్యే సరికి భార్య, కూతురు ఇద్దరు మంచం మీద పాము కాటుతో మరణించి కనిపించారు. తనకేం తెలియదన్నట్లు నటించిన భర్త.. భార్య, కూతురు మరణంపై పోలీసులకు సమాచారం అందించాడు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

అయితే తన కూతురిని అల్లుడే హత్య చేశాడంటూ బాధితురాలి(భార్య) తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంలో ఆలస్యం కావడంతో ఘటనా జరిగిన నెల తర్వాత అతడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో పాము తనంతట తానే గదిలోకి ప్రవేశించి ఉండవచ్చని బుకాయించిన నిందితుడు తరువాత చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
చదవండి: అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి

మరిన్ని వార్తలు