బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!

24 Nov, 2023 10:59 IST|Sakshi

పాన్‌గల్‌: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు.

అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్‌ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు.

అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య
అమరచింత:
స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్‌ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com.

ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.!

మరిన్ని వార్తలు