గంజాయికి బానిసై వేధిస్తున్నాడని.. 

11 Oct, 2022 01:46 IST|Sakshi

కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు 

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఘటన 

తిరుమలగిరి(తుంగతుర్తి): గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శనగర్‌కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్‌ (23) డీజే సౌండ్‌ బాక్సులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అతనికి భార్య సౌమ్య, కుమా రుడున్నారు. గంజాయికి బానిసైన కిరణ్‌ రోజూ ఇంట్లో గొడ వపడుతుండటంతో సౌమ్య కుమారుడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరింతగా గంజాయి సేవించి వస్తూ రోజూ తల్లిదండ్రులను కొడుతున్నాడు. తనకు డబ్బులివ్వా లని 2 నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగులబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శకు తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్‌ తల్లిదండ్రులను కొట్టి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుతున్నాడు.

ఈ క్రమంలో సోమవారం గంజాయి సేవించి ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదనుగా కిరణ్‌ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు. అయితే కుమారుడి మరణం తట్టుకోలేక వారు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. అనంతరం కిరణ్‌ తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

ఆత్మరక్షణ కోసమే చంపేశాం 
రెండేళ్లుగా రోజూ గంజాయి సేవించి వచ్చి వేధిస్తున్నాడు. రోజూ కొడుతుండటంతో భయం భయంగా బతుకుతున్నాం. కుమారుడు ఏం చేస్తున్నాడని అడిగితే ఏమీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. సోమవారం మధ్యాహ్నం గంజాయి సేవించి వచ్చి మమ్మల్ని కొట్టాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మరక్షణ కోసం చంపేశాం.  
– కిరణ్‌ తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ  

మరిన్ని వార్తలు